Tuesday, 24 September 2013

నారాయణ!!! నారాయణ!!!


నారాయణ!!! నారాయణ!!!

నారాయణ!!! నారాయణ!!! అంటూ హరినామం జపిస్తూ సర్వ జగత్ సంచారి అయిన నారదులవారు విష్ణులోకం చేరారు. దర్శనం చేసుకుందామని అలా శేష తల్పం పై  చూస్తే సతీ సమేతం గా శ్రీమన్నారయణుడి తో తులతూగే ఆది శేషు అలా ఖాళీగా  కనిపించాడు. పక్కనే శంఖు  చక్రాలు కనిపించాయి. స్వామి వారు శంఖు చక్రాలు కుడా ధరించకుండా లక్ష్మీ దేవితో కలసి మరో గజేంద్ర మోక్షం కోసం వెళ్ళారేమో అని ఆలోచిస్తూ ఉండగా, ఇంతలో సుదర్శనుడు స్వామి వారి దర్శనం ఇప్పుడప్పుడేకాదు అని చెప్పాడు.

ఎందుకు కాదు...!! మళ్లీ ఏమన్నా గజేంద్రుడు పిలిచాడా? అడిగారు నారద మహర్షి!!


"ఆ ఏముంది !! లేక లేక ఈ మధ్యనే అడపా దడపా భక్తులు మా స్వామి కి విశ్రాంతి ఇస్తున్నారు. అదేదో సమైక్య ఉద్యమం అట!! మా అమ్మ గారికి బంతి ఆట అంటే ఏంటో ఇష్టం, ఎన్నో వేల యుగాల నుండి అయ్యవారితో ఆడాలని మహా ముచ్చట పడిపోతూ ఉంటారు అమ్మ. ఈ మధ్య లియాండర్ పేస్ గెలిచినా ఆట నేర్చుకోవాలని పట్టు బడితేనూ......అలా ఇద్దరూ కలసి పాల కడలిలోనే ప్రాక్టీసు చేసుకుంటున్నారు " అంటూ సెలవిచ్చాడు సుదర్శనుడు.

సరేలే సుదర్శనా...నాకు కూడా దర్శన భాగ్యం లేదనుకుంటాను. అలా కైలాసం  చూసుకుని తిరిగి మళ్ళీ  వెళ్ళే దారిలో వస్తాలే...అంటూ సెలవు తీసుకున్నారు నారదులు.

**********
నారాయణ!!! నారాయణ!!!

రండి స్వామి రండి అంటూ పార్వతి దేవి నారద మహర్షిని ఆహ్వానించింది!! పరమ శివునితో కుశల ప్రశ్నలు వగైరా అయిన తరువాత విష్ణు లోకం లో లక్ష్మీ దేవికి పట్టిన అదృష్టాన్ని, అక్కడ వారు ఆడుకుంటున్న ఆటలు  వివరించి , అలా పార్వతి ముఖం లో చోటుచేసుకున్న చిన్నపాటి అసూయను గమనించి మరీ అక్కడ నుండి వెనుదిరిగాడు మహర్షి!!

ఇక వెంటనే ఆలస్యం చేయకుండా కైలాసానికి సెలవు ప్రకటించి ఏదన్నా విహార యాత్రకు వెళదామని పార్వతి కోరింది.

ఆయనకంటే సమైక్య ఉద్యమం పేరిట తిరుపతి కి భక్తులు రావటం లేదు!! కానీ మన పరిస్థితి అలా కాదు దేవీ!! అని నచ్చ చెప్పి చూసాడు శివుడు!!

అయినా నేను ఏమైనా కోరరాని కోరిక కోరేనా ఏమిటి? ఎప్పుడో దాక్షాయని గా హైమావతి గా జన్మించాను. మళ్ళీ జన్మించాలని లేకపోయినా, అలా నా పుట్టిల్లు ద్రాక్షారామా న్ని అలా దూరం నుండి చూసి అలా నాటి జ్ఞాపకాలను ఒక సారి నెమరు వేసి వద్దాం, కరుణించండి స్వామి అని ప్రాధేయ పడింది.

అయినా ఏ భార్య అయినా ప్రాధేయ పడితే  ఏ భర్త మాత్రం కాదన గలడు??

*********

అనుకున్న ప్రకారం కైలాసానికి వారం సెలవు ప్రకటించి పుష్పక విమానం లో అలా హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడ విశేషాలను చూసి , పుష్పక విమానం లో విహరిస్తూ ఉండగా...బెజవాడ దగ్గర అనేక లక్షల మంది జనం కనపడ్డారు.

ఆ వేడుక ఏమిటో చూద్దాం అని ఇద్దరు మానవ రూపం ధరించి జనాల్లో కలసిపోయారు. అక్కడ ప్రసంగాలు అన్ని జాగ్రత్త గా వింటోంది పార్వతి. ఇంతలో మలయ మారుతమల్లె వర్షం పడ సాగింది.
నా ఆజ్ఞ లేకుండా నా మీదే వర్షమా?? అని ఆశ్చర్య పోతూ శివుడు పార్వతి వంక చూసాడు. అప్పడు అర్ధం అయింది.. పార్వతి కనుల వెంట జాలు వారుతున్న కన్నీరే ఈ  వర్షపు ధారలు  అని.

పార్వతి ని అలా సముదాయిస్తూనే ద్రాక్షారామం చేరుకున్నారు. దారి పొడవునా కూడా అనేక మంది జనాలు. కొందరివి లక్ష అర్చనైతే, మరికొందరివి మానవ హారాలు. కాని ఎక్కడ చూసినా జనమే!!!  ఈ జన సంద్రానికి గల కారణం తెలుసుకోవటానికి బెజవాడ సభకు వెళ్లి వచ్చిన పార్వతికి ఆట్టే సమయం పట్టలేదు. పైగా ఈ జన ఘోషలు, జల ఘోషలు చూసి స్త్రీ గా చాలా కలవర పడింది. . 

తన పుట్టిల్లు ని తనివి తీరా చూసుకున్న పార్వతి అలౌకిక ఆనందానికి గురి అవుతుంటే, పరమ శివుడు ఒక చిరు నవ్వు చిందించాడు

దీనికంతటికి కారణ భూతులైన వారందరినీ ఆది దంపతులు దివ్యదృష్టి తో వీక్షించారు, ఇందులో ఒక విదేశి వినిత, ఇంకా చుట్టూ పక్కల ఒక ముగ్గురు స్త్రీలు ,ఇంకా మిగతా ఇతర భాషీయులు, ఇతరులు అందరు కనిపించారు.  ఇందులో ప్రధాన పాత్రధారులు స్త్రీలు అని తెలుసుకున్నపార్వతి మరింత కుంగి పోయింది.
నాధా...మనం ఈ భూలోకానికి ఎoదుకు వచ్చినట్లు..?? మనం ఎందుకు ఈ బాధ లు చూసినట్లు..?
పద పార్వతీ.. మనం మన కైలసానికి వేళ్లిపోదాం అన్నాడు శివుడు.

******
కైలాసం లో ఒక పెద్ద సభ జరుగుతోంది. అందులో 3 కోట్ల మంది దేవతలు హాజరయ్యారు. బ్రహ్మ గారు మాత్రం ఏదో బిజీ గా ఉండి రాలేక పోతున్నాను అని రాలేదు.  భులోకం లో 12 కోట్ల తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని పార్వతి వివరించింది. పనిలో పనిగా, పార్వతి కి మద్దతు గా పక్కనే ఉన్నబసవన్న కూడా పనిలో పనిగా ఓ పెద్ద రంకె వేసాడు.
ఇప్పుడు మనం మేలుకోకపోతే, తిరుపతి వెంకన్న కు పట్టిన గతే, మిగతా అందరికి పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్ద లేరా  అని అర్ధించిది!!! అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.

దూరం గా ఎక్కడో నారాయణ..! నారాయణ..! అని వినపడగా, అందరు స్వామి!! మీరే పరిష్కారం చూపండి అంటూ ఆయన్ని వేడుకున్నారు. అప్పడు నారదుని ఆజ్ఞానుసారం అందరు బ్రహ్మను వేడుకోకా ఆయన ప్రత్యక్షం
అయ్యాడు. వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు!!

"దేవతలారా!!! బాధ పడకండి!!! మనకీ కస్టాలు తప్పవు, ఎందుకంటే కొన్ని సార్లు మనం దుష్ట శిక్షణ చేయలేదు....జైలులో ఊచలు లెక్క పట్టాల్సిన వారు, ఇంట్లో నోట్లను లెక్కపెట్టుకుంటున్నారు...సరియిన సమయం లో మాట్లాడ వలసిన వారు మూగ పోతున్నారు. అటువంటి పాప ఫలితమే ఇది!! కాకపోతే ఇది తాత్కాలికం, మరికొన్ని నెలల్లో వారికి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పాపం లో భాగస్వాములందరికీ అక్కడి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. ఒక రకం గా భూలోక వాసులు అదృష్ట వంతులు. కాబట్టి ఓ నా దేవతలారా!!! వేదన చెందకండి!!! ఆ ఓటు వేసే విజ్ఞతను మీ మీ భక్తులకు మీరే ప్రసాదించండి ..తథాస్తు" అని ఆశీర్వదించారు.

@@@@@@@@@@@@@@@@@




Tuesday, 10 September 2013

గు(చి)రు అభిమానం


గు(చి)రు అభిమానం



రాధా మనోహరి టీచర్ గారికి!!
ఉభయకుశలోపరి!!
గురుపూజోత్సవ శుభాకాంక్షలు. మీ శిష్యురాలిగా మీ దగ్గర విద్య నేర్చుకున్నందుకు , నన్నొక మంచి పౌరురాలిగా తీర్చి దిద్దిన మీ దంపతులిద్దరికీ నా మనః పూర్వక కృతఙ్ఞతలు.

 టీచర్ గారూ,  ఏదో  ఒక రకం గా మిమ్మలిని తలచుకోలేని రోజు లేదు అంటే నమ్మండి. చివరకు
ఇటీవలే  వచ్చిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమా చూస్తున్న మిమ్మలినే తలచుకున్నాను. మీరు చిన్నప్పుడు మాకు చెప్పిన ఓ చిరు పాట సినిమా రూపం లో దర్శనం కాగానే, ఎంత ఆనంద పడ్డానో అంతే మీరు దగ్గర లేరు అని బాధపడ్డాను.  ఆ పాట ఎప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది
కొమ్మ విరగాకుండా పూలు కోయండి
అందులోపెద  పూలు  దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకివ్వండి

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దాచుకోకుంటేను దోచుకుంటారు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు

అంటూ సరదాగా మీరు చెప్పిన  అనేక పాటలు, భాగవత పద్యాలు, బీర్బల్ కథలు  ఇలా ఒకటేమిటి అన్ని నెమరువేసుకుంటూ ఉంటాను .

ఇంతేకాదు టీచర్ గారూ! మీరు మాకు పరిచయం చేసిన భువన విజయం , అల్లసాని పెద్దన, నది తిమ్మన అంటూ వారి పరిచయాలు , వికటకవి గురించి చెప్పిన కథలు , వారి కళాపోషణ , రత్నాలు రాశులుగా అమ్మటం ఇవన్ని కేవలం ఎలిమెంటరీ లోనే మాకు పరిచయం, వాటిమీద ఆసక్తి కలుగచేసారు . నా ఉన్నత విద్య రీత్యా రాయల సీమ లో చదువుకున్నప్పుడు నేను ఎంత అలౌకిక ఆనందానికి గురి అయ్యానో, ఆ ఆనందం వెనుక కారణం ఏమిటో ఇక నేను మీకు చెప్పనక్కర్లెదు.

అంతేకాదు టీచర్ గారూ,\!! ఈ మధ్య ఎక్కడ చూసినా విభజన గొడవలే కదా!!! ఈ మధ్య ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లాల పేర్లు వరుసగా చెప్పటం మీద చర్చ చేస్తున్నారు !! వెంటనే నాకు అలవోకగా "శ్రీకాకుళం, విజయనగరం ..... హైదరాబాద్ " దగ్గర fullstop పెట్టేటప్పటికి అవాక్కవటం వారి వంతయింది. అప్పుడు నేను మా టీచర్ గారు ప్రతిరోజు మా చేతచెప్పించేవారు అని చెప్పాను. అప్పుడు కూడా నేను మీ శిష్యురానిని అయినందుకు నేను చాల గర్వపడ్డాను. ఇలా ఒకటేమిటి రోజూ ఏదో ఒక రకం గా మిమ్మలిని తలుస్తూనే ఉంటాను .

ఇంకా ఇప్పటి చిన్న పిల్లలు అయితే, మాధ్యమాల ప్రభావం కావచ్చు  టీచర్ గారు!!! పిల్లల పాటలు తెలిసిన పిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు, తపు తప్పు, అసలు అవి తెలుగులో బోధించే టీచర్లు లేరు!! మీరు మాకు సాయంత్రం కాగానే ఎన్ని పాటలు పాడించే వాళ్ళు !!అంతెందుకు , పోతన భాగవతంలోని పద్యాలు మీ దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్ధికి వచ్చు  తెలుగులోని మాధుర్యం మేము మీ దగ్గర అనుభవించిన వాళ్ళమే!!! మీరు కమ్మగా పాడుతుంటే ఎంత మధురంగా ఉండేది??? అందరం నిశ్సబ్దంగా ఉండేవాళ్ళము అంటే  మీ పాటకు మేము బానిసలము !!

మీరు బడికి రాని  రోజు  ఎంతో నిస్సత్తువగా ఉండేది . ఇప్పటికీ ఊరు వెళ్తే మన సత్రం బడి కనపడుతుంది (మా బడి కి ఉన్న పేరు అది. మాకు బడి ఉంది కాని బడికి భవనం లేక, ఎటువంటి సదుపాయాలూ లేని, కనీసం ఒక గేటు కూడా లేని   ఒక విశ్రాంతి భవనం లో మా బడి నడిచేది, అందుకే దానికి సత్రం బడి అని పేరు ) చాల శిధిలావస్థలో ఉంది!!! కాని ఆ జ్ఞాపకాలు మాత్రం  పదిలంగా మదిలో భద్రం గా ఉన్నాయి.

ఇక మీకు ఎప్పుడన్నా పొలమారినా , నేనో లేక నా లాంటి మీ శిష్యులు మిమ్మలిని తలుస్తున్నారు అని మీకు తెలియాలని మీ కోసం  మొన్నీమధ్య వాకబు చేశాను .!! మీరిక్కడ లేరని, చల్లపల్లిలో  ఉన్నారని సమాచారం అందింది ఎక్కడున్నా మీరు క్షేమం గాఉండాలని , మరింతమంది భావి భారత పౌరుల్ని తయారు చేయాలని ఆశిస్తూ ...
                                                                                                                మీ చిన్నారి
                                                                                                                    సుభాషిణి